వెయ్యి కొట్టు కొత్త రేషన్ కార్డు పట్టు
– దందా గిరి లేపుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు.
– డోర్నకల్ నియోజకవర్గం లో పలు మండలాలలో ఇదే దంద
– కొత్త రేషన్ కార్డు ఆశ హవుల నుంచి డబ్బులు వసూలు
–
– పలు మండలాలలో బహిరంగంగానే చర్చించుకుంటున్న ప్రజలు
మరిపెడ నేటిధాత్రి.
తెలంగాణ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఏ స్కీంకు అప్లై చేసుకోవాలన్న కానీ కావలసింది రేషన్ కార్డు.
అయితే ప్రతి కుటుంబంలో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు అనేది అవసరం.
అయితే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు లేక ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది గురి కావడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మీసేవ సెంటర్ల ఆన్లైన్ చేసుకొని ఎమ్మార్వో ఆఫీస్ లో ఇచ్చినచో వెరిఫికేషన్ చేసి వెంటనే కార్డు మంజూరు చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే దీనికి భిన్నంగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.
రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి కార్డుకు వెయ్యి రూపాయల చొప్పున కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు ఆరోపిస్తున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ అధికారులు చేస్తున్న పని తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత తిరిగి ఎమ్మార్వో ఆఫీస్ లో అప్లై చేసుకొని కార్డు మంజూరు చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు.
ఇది అదును చేసుకొని రెవెన్యూ అధికారులు మాత్రం సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
రేషన్ కార్డు కావాలని వచ్చిన వాళ్ల నుంచి కొంతమేర డబ్బులు వసూలు చేసుకుని వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కొంతమంది రోజులు గడిచిన గాని రేషన్ కార్డు మంజూరు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఒకే రోజు ఇద్దరు అప్లై చేసుకోగా అందులో ఒకరికి వారంలో కార్డు మంజూరై మరొకరికి రాకపోవడంతో కంగు తింటునారు.
డబ్బులు ఇస్తేనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.
డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు మంజూరు చేసే అధికారుల పైన పై స్థాయి అధికారులు దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని రేషన్ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు.