బోనమెత్తిన దొంతి… భక్తి జోష్లో కాటమయ్య ఉత్సవాలు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న కాటమయ్య ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన బోనాల పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, భక్తి భావంతో బోనాలు మోసి కాటమయ్య కి బోనాలు సమర్పించారు. సంప్రదాయ వేషధారణలో బోనమెత్తిన నాయకులు భక్తులతో కలసి ఊరేగింపులో పాల్గొనడం విశేషం.స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రార్థించారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు, గౌడ సంఘ మహిళలు, పురుషులు, చిన్నలు, పెద్దలు ,వృద్ధులు, హాజరై కాటమయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించిన వీధులు, బోనాల ఊరేగింపుతో నెక్కొండ మండల కేంద్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తుల నినాదాలతో ప్రాంతం మార్మోగింది.
