వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ గ్రామపంచాయతీ రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ట్యాంకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, వేసవిలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు.
