రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.
ఫీవర్ ఆస్పత్రికి కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు రేబిస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో 2023లో 27,172 మందికి చికిత్స అందించగా, 13 మంది రేబిస్తో చనిపోయారు. 2024లో 29,054 మందికి చికిత్స చేయగా, 16 మంది చనిపోయారు. ఈ ఏడాది 24,705 మందికి వైద్యం అందించారు. 34 మంది రేబి్సతో మృతిచెందారు.
– ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 60 నుంచి 80 కేసులు వస్తున్నాయి. నెలలో ఒకటి, రెండు కేసులు రేబి్సకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రతీ ఏడాది 20 వేలమంది టీకాలు వేసుకుంటున్నారు.
నారాయణగూడ ఐపీఎంకు ఈ ఏడాది ఇప్పటి వరకు 33,765 మంది కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఐపీఎంను ప్రతీనెల 2,200 నుంచి 2,600 మంది కుక్కకాటు బాధితులు ఆశ్రయిస్తున్నారు.
– హయత్నగర్ ఆస్పత్రిలో నెలకు 400 మంది చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రికి నెలకు 275-300 మందికి కుక్కకాటు టీకాలు వేస్తున్నారు.
– రాజేంద్రనగర్ ఆరోగ్య కేంద్రంలో నెలకు 90-100 మంది, హయత్నగర్ నెలకు 300 మంది టీకాలు వేయించుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
