మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన..

మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. ఆ తర్వాత ఏమైందంటే..

 

 

 

 

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆ తర్వాత పలు విమాన సర్వీసుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వేళ.. ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

న్యూఢిల్లీ, జూన్ 29: విమానంలో మహిళా సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై ఎయిర్‌పోర్ట్‌లో కేసు నమోదయింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుబాయ్‌ నుంచి జైపూర్‌కు వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఒక ప్రయాణికుడు పీకల దాక మద్యం సేవించాడు. అనంతరం విమాన సిబ్బందిలోని ఒక మహిళతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ.. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. ఈ విమానం గమ్యస్థానం చేరుకున్న తర్వాత.. అంటే జైపూర్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు ఎయిర్ ఇండియా అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

మరోవైపు.. శనివారం అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు తన సహచర ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో నడక మార్గంలో నిలబడి.. మరో ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్తా.. ఘర్షణకు దారి తీసింది. ఈ వ్యవహారంపై విమాన సిబ్బందికి సహచర ప్రయాణికులు సమాచారం అందించారు. దీంతో బాధితుడిని బిజినెస్‌ క్లాస్‌ సీటుకు మార్చారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే.. ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి అప్పగించిన విషయం విదితమే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version