గిరిజన యూనివర్సిటీ భూములను ఇతర వ్యాపార సముదాయాలకు కేటాయిస్తే ఊరుకునేది లేదు
అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలి
అవసరమైతే న్యాయ పోరాటాలకు సిద్ధమవుతాం
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
ములుగు టౌన్: గిరిజన విశ్వవిద్యాలయానికి సేకరించిన భూములను విశ్వవిద్యాలయానికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఇతర వ్యాపార సముదాయాలకు కేటాయిస్తే ఊరుకునేది లేదని అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పెట్రోల్ బంకు లాంటి వ్యాపార సముదాయాలు నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం సేకరించిన భూముల విషయంలో చాలామంది దళిత, గిరిజన నిరుపేదలు కూడా తమకున్న భూములను ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు. తమ ప్రాంతంలో ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం కోసం ములుగు జిల్లాలోని ప్రతి ఒక్కరూ గర్వంగా భావించారని, ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి లభిస్తుందనే ఆశలు జిల్లా ప్రజల్లో ప్రబలంగా ఉన్నాయని ఆయన అన్నారు. యూనివర్సిటీ కోసం సేకరించిన భూములను విశ్వవిద్యాలయం కోసం కాకుండా ఇతర వ్యాపార సముదాయాలైన పెట్రోల్ బంకులు లాంటి నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి రూపాంతరం చెందిన తర్వాత మిగులు భూములను ప్రభుత్వం అక్కడ పరిస్థితులు బట్టి ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు పూర్తి నిర్మాణాలు కాకముందే వ్యాపార సముదాయాలకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో న్యాయపోరాటం కోసం అవసరం అయితే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థం కోసం విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను ఎవరికి అప్పచెప్పవద్దని ఆయన అధికారులను వేడుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ పనులు ఎంతవరకు జరిగాయో వాటికి సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సంబంధించిన అధికారులను కోరారు. ఈ విషయంలో గౌరవ ములుగు జిల్లా కలెక్టర్, యూనివర్సిటీ వీసీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి ములుగు జిల్లా నాయకులు పాల్గొన్నారు.