మహా ముత్తారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు పారుతున్న రహదారులపై ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మహా ముత్తారం మండలంలోని ముత్తారం – యామనపల్లి కేశవాపూర్ – పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు తో భారీ కేండింగ్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతి శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగుల్లో చేపలు పెట్టేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. రహదారిపై నీళ్లు పారుతున్నందున ప్రజల రావాణా ఏ విధముగా చేస్తున్నారని పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాం నగర్ మీదుగా వెళ్తున్నారని ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ డిఈ రవీందర్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ ఓ అనూష తదితరులు పాల్గొన్నారు.