నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి
పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్
గుండాల,నేటిధాత్రి :
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమయిందని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శక రవి అన్నారు.
గురువారం గుండాల మండల కేంద్రంలో జరిగిన ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ గుండాల మండల కమిటీ సమావేశంలో తను మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేలు కల్పిస్తామని, అలాగే నిరుద్యోగులకు రుణాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకొని నేటి వరకు ఇవ్వలేక పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి జాబ్ కేలండర్ ప్రకటిస్తామని ఇప్పటివరకు ప్రకటించ లేకపోయారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ గుండాల మండల అధ్యక్ష కార్యదర్శులు తాటి రమేష్, కల్తీ ప్రమోద్, మండల నాయకులు మోకాళ్ళ పోతయ్య, అరెం రామారావు, ఈసం సుధాకర్, ఇసం రమేష్, కల్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
