నాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
జయంతి సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
పరకాల,నేటిధాత్రి
మండలంలోని నాగారం గ్రామంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నాగారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గ్రామంలో ఉదయం నుంచే ప్రత్యేక వాతావరణం నెలకొంది.అనంతరం గ్రామ పెద్దలు,యువత,నాయకులు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పరకాల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు,బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.సుమారు 30 మంది రోగులకు ఈ సహాయం అందించబడగా రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ చూపిన మానవతా దృక్పథాన్ని ఆచరణలో పెట్టాలనే సంకల్పం స్పష్టంగా కనిపించింది.
ఈ సందర్భంగా ఆర్మీ కానిస్టేబుల్ కిషోర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.సమాజంలో సమానత్వం,న్యాయం,విద్య ప్రాధాన్యతపై ఆయన చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు.యువతకు సందేశంగా అంబేద్కర్ ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టాలని,ముఖ్యంగా విద్య ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక పురోగతిని సాధించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఐక్యత,సేవా భావం ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు.అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మీ కానిస్టేబుల్ రామంచ కిషోర్, పాలకుర్తి దిలీప్,జూపాక కార్తీక్,రామంచ కృష్ణ,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్.బాలకృష్ణ,స్టాఫ్ నర్స్ లు తదితరులు పాల్గొన్నారు.
