మక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనలు

మక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనలు

23 న నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనలు

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

మద్దతు ధర లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు

రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది.గురువారం నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట ప్రాంతంలో 42 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం కేవలం 6 కేంద్రాలకే పరిమితమైందని విమర్శించారు.దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, రైతులకు 45 నుంచి 90 రోజుల వరకు చెల్లింపులు వాయిదా వేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2400 మద్దతు ధరకు బదులుగా రూ. 1600 నుంచి 1800 మధ్యే విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు.గన్ని సంచుల కొరతతో 45 డిగ్రీల ఎండలో రైతులు రోడ్లపై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో సుమారు 70 వేల ఎకరాల్లో ఈ యాసంగిలో మక్కజొన్న సాగు జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిపడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరకు మక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేపటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version