గ్రామంలో విస్తృత కాలువల శుభ్రత: ప్రజారోగ్యానికి పెద్దపీట
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మోరీ కాలువల శుభ్రత కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, పంచాయతీ సభ్యులు, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో పారిశుధ్య కార్మికులు ఈ పనులు చేపట్టారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, మురుగు నీటిని తొలగించడం ద్వారా దోమల బెడద తగ్గి ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రవహిస్తుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
