అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు .. క్షుణ్ణంగా తనిఖీలు.
సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ ఐపీఎస్
సూర్యాపేట, నేటి ధాత్రి:
పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి నరసింహ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికిచేస్తునట్లు తెలిపారు.మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను,చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానత వ్యక్తులకు కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచామన్నారు. వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఉంచి రాత్రిం బవళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు, పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్ళాలి అన్నారు.ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది ఉన్నారు.
