మాదకద్రవ్యాల (గంజాయి) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– విద్యా సంస్థలలో యాంటి డ్రగ్స్ కమిటీల ఏర్పాటు

– గంజాయి తో పాటు గుడుంబా నివారణకు పక్కా కార్యాచరణ

– జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాల గంజాయి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో
జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులను పక్కా కార్యాచరణతో కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న 525 ప్రభుత్వ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని, వీటిని యాక్టివ్ గా ఉంచుతూ డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల పై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని, పిల్లలకు డ్రగ్స్ పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.

కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

విద్యా సంస్థల్లో నిర్వహించే పేరెంట్ టీచర్స్ సమావేశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే వచ్చే పరిణామాలు, మాదకద్రవ్యాల బానిసత్వం నివారణకు ప్రభుత్వం సిరిసిల్ల రాజీవ్ నగర్ బస్తీ దవఖానలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ మొదలగు అంశాలను వివరించాలని, పేరెంట్స్ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందజేయాలని కలెక్టర్ సూచించారు.

డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.

మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో గంజాయి తో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.
చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియ జేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎస్పీ అఖిల్ మహజాన్ మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కానిగా ఏర్పాటు చేశామని, గత సంవత్సర కాలంగా మాదకద్రవ్యాలకు సంబంధించి 17 కేసులో నమోదు చేసి దీనికి సంబంధించిన 160 పైగా వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

డ్రగ్స్ నివారణ కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు .మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్, గుడెంబా సంబంధించి పౌరులకు ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656426 కు తెలియజేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో ఎల్.రమేష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, మెడికల్ సూపరింటెన్డెంట్ లక్మినారాయణ, డి.ఈ.ఓ రమేష్ కుమార్ , ఇన్చార్జి డీ.ఏ.ఓ రామరావు, డి.ఐ.ఓ. శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *