Strict Action Against Drunk Driving in Bhupalpally
మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
భూపాలపల్లి,నేటిధాత్రి:
మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 సందర్భంగా నూతన సంవత్సర వేడుకలకు నాంది పలుకుతున్న సందర్భంగా భూపాలపల్లి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెచ్చరికలు జారీ చేశారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి పూట పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా , యువత పట్టణ ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు.
మద్యంతాగి వాహనాలు నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని సూచించారు.మద్యం తాగి వాహనాలు నడపడం వలన ప్రాణాపాయానికి దారితీస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాత్రి పూట భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు ముఖ్య ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడతాయన్నారు.మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని
అలాగే అనుమతి లేకుండా డీజేలు, అధిక శబ్ద కాలుష్యం, రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగడం, ఆకతాయిల చర్యలు, అల్లర్లు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ఏలాంటి ఘటనలకు పాల్పడిన ఆ వ్యక్తులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.యువత స్వీయ నియంత్రణ పాటిస్తూ నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని భూపాలపల్లి పట్టణ సిఐ డి.నరేష్ కుమార్ తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు నిలుపుదల చేయగలమని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు గమనించినచో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
