అతివేగం బలితీసుకుంది: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి…
జహీరాబాద్ నేటి దాత్రి:
కోహిర్ మే 22: నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గొల్ల రాజు (వ్యవసాయ రైతు) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోత్తూర్ (కె) గ్రామానికి చెందిన గొల్ల రాజు ఈరోజు ఉదయం తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో పొలంలోని మోటార్ స్టార్టర్ పెట్టె పాడవడంతో, దానిని బాగు చేయడానికి కటింగ్ ప్లేయర్ అవసరమైంది. దీంతో గొల్ల రాజు పక్క పొలం వ్యక్తి అయిన జావేద్ యొక్క బైక్ను తీసుకుని బయలుదేరాడు రాజు బైక్పై వెళ్తుండగా, భిలాల్పూర్ వైపు నుండి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అతివేగంగా అజాగ్రత్తగా దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న రాజు బైక్ను సదరు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రాజు తలకు, చేతికి తీవ్ర రక్తగాయాలయ్యాయి.ప్రమాద స్థలంలో ఉన్న రాజు కుమారుడు గొల్ల కౌశిక్ తీవ్రంగా గాయపడిన తన తండ్రిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 03:20 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ రాజు ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. తండ్రి మరణంతో కుమారుడు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కుమారుడు కౌశిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోహిర్ ఎస్సై టి.నరేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
