విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ- అవగాహన తరగతులు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
మంచిర్యాల,నేటి ధాత్రి:
10వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి,జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,ఎ. టి. డి. ఓ. సురేష్, టి.ఎన్.జి.ఓ.స్ ప్రతినిధి గడియారం శ్రీహరి,మానసిక వైద్య నిపుణులు సునీల్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ-అవగాహన తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి విద్యార్గి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని,ఇష్టంతో చదివి, పట్టుదలతో సాధించి ఉన్నత స్థానాలలో నిలవాలని, తల్లిదండ్రులకు,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ప్రేరణ-అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని,విషయ నిపుణులైన ఉపాధ్యాయులు ఇచ్చే మెలకువలను పాటించి, అన్ని సబ్జెక్టులలో 100 శాతం మార్కులు సాధించాలని, వార్షిక ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణతతో మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి ధర్మానంద్ గౌడ్,ఉపాధ్యాయులు,వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
