Stop Dog & Monkey Menace
నలభై డివిజన్ ప్రజలను కుక్కల, కోతుల బారి నుండి కాపాడండి- పైడిపల్లి రాజు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని నలభై డివిజన్ హనుమాన్ నగర్, తిరుమల నగర్ ప్రజలను కుక్కల కోతుల బెడద నుండి కాపాడాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రోజున నలభై డివిజన్లో బ్లూ బెల్ స్కూల్ వద్ద జరిగిన ప్రజాపాలన వార్డు సభలో కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ వార్డు ఆఫీసర్ స్రవంతి, సిఓ పద్మ, జవాన్ సంజీవ్ లకు సిపిఐ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ నలభైవ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, తిరుమల నగర్ ప్రజలు వీధి కుక్కల ఆగడాలు భరించలేకపోతున్నారని, కోతుల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్న పిల్లలను స్కూలుకు పంపించే సమయంలో కోతులు బ్యాగులు గుంజుతూ మనుషులపైకే వస్తున్నాయని, కుక్కలు స్కూల్ పిల్లలకు టిఫిన్ ఇచ్చే సమయంలో వెంటపడుతున్నాయని చిన్న పిల్లల పైకి వస్తున్నాయని దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు. వీధి కుక్కలు, కోతులు దాడి చేయడం వల్ల గతంలో హనుమాన్ నగర్ లొ ఒక వ్యక్తి మరణించారని అయినా అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. కుక్కల, కోతుల దాడుల వల్ల అనేక రకాలుగా ప్రజలు గాయాలపాలై హాస్పిటల్ లో వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారని, పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనo చేయడానికి ఇంటికి వచ్చే వారిని ఇంట్లోకి రానీయకుండా ఇంటి పైన కోతులు ఉండడం వల్ల భోజనం చేయలేని పరిస్థితి కరీంనగర్లో దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు కుక్కల, కోతుల నుండి ప్రజలను కాపాడాలని లేనిపక్షంలో ప్రజల చేత ఆందోళనలు చేస్తామని పైడిపల్లి రాజు హెచ్చరించారు. ఈవినతి పత్రం సమర్పించిన వారిలో బొడ్ల ప్రభాకర్, భగవాన్ రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
