*సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నాం……*
◆-: దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు.. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త
◆-: చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్ ,బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచనలు.. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
