
సీతగా సాయిపల్లవి.. అందుకే
రామాయణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా..
రామాయణ’.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా గురించే అంతా చర్చించుకుంటున్నారు. ‘నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అట.. ‘అవతార్’ సినిమా బడ్జెట్ కంటే ఇది ఎక్కువట.. వర్కవుట్ అవుతుందా?’
అనేది వారి చర్చ. సినిమా బాగా ఆడాలని, భారతీయ సినిమా గొప్పతనాన్ని ‘రామాయణ’ మరోసారి చాటి చెప్పాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. అయితే ఎందరో హీరో హీరోయిన్లు ఉండగా రాముడిగా రణ్బీర్ కపూర్ను, సీతగా సాయిపల్లవిని తీసుకోవడం ఏమిటనే విమర్శలు వినిపించకపోలేదు. దీనిపై సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా స్పష్టత ఇచ్చారు. ‘రాముడిగా రణ్బీర్ను తీసుకోవడానికి కారణం.. ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం, గొప్పగా నటించగల నైపుణ్యం. అలాగే సీత పాత్రకు సాయిపల్లవిని ఎన్నుకోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. మొదటి నుంచీ ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్నారు. అందం కోసం సర్జరీలు చేయించుకోలేదు. కృత్రిమం కంటే సహజ అందమే మేలు అనే భావన ఆమెది. తెరపై సీతారాముల్ని చూడగానే ఓ పవిత్రమైన భావన కలగాలని ఆ పాత్రలకు వీరిద్దరినీ ఎంపిక చేశాం’ అని వివరించారు. ‘రామాయణ’లో రావణుడిగా కన్నడ హీరో యశ్ నటిస్తున్నారు. ఆయన ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడా. ఆయన సరసన మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.
హాన్స్ జిమ్మర్తో రెహమాన్
‘రామాయణ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం కోసం జర్మనీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్తో చేతులు కలిపారు ఏఆర్ రెహమాన్. ఇప్పటివరకూ జిమ్మర్తో కలసి లండన్, లాస్ఏంజెల్స్, దుబాయ్లో సంగీత చర్చలు జరిపాననీ, భారతీయ కళావైభవాన్ని చాటే గొప్ప చిత్రం ‘రామాయణ’కు పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు రెహమాన్ వెల్లడించారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.