24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ
మహాసభను జయప్రదం చేయాలి
వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు
నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు