వంతెనల నిర్మాణానికి రూ.44.10 కోట్లు మంజూరు…

వంతెనల నిర్మాణానికి రూ.44.10 కోట్లు మంజూరు

తీరనున్న ప్రజల కష్టాలు.

జడ్చర్ల/ నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో వంతెనలు కట్టడానికి గత ఏడాదిలో తాను చేసిన ప్రతిపాదనల కోసం అవసరమైన రూ.44.10 కోట్లను వెంటనే మంజూరు చేసి, వంతెనల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీతక్క వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారని వెల్లడించారు.
అనిరుధ్ రెడ్డి గురువారం మంత్రి సీతక్కను కలిసి గతంలో తాను ప్రతిపాదించిన వంతెన నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరామని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జూన్ నెలలో తాను జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరమున్న ప్రాంతాలను గుర్తించి వీటి నిర్మాణానికి నిధులను కేటాయించాల్సిందిగా కోరామని గుర్తు చేసారు. ఈ విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సీతక్క పంచాయితీరాజ్ ఈఎన్సీకి ఆదేశించడంతో దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ మొదలైయిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. తాను నియోజకవర్గంలో ప్రతిపాదించిన తొమ్మిది వంతెనల వివరాలను ఆయన వివరించారు. జడ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తాండాకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తాండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, శేరిగూడ నుంచి బోడజానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని చెప్పారు. నవాబుపేట మండలంలో వీరశెట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెల్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.40 కోట్లు ప్రతిపాదించామన్నారు. రాజాపూర్ మండలంలో రాయపల్లి నుంచి కుచ్చర్కల్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, మిడ్జిల్ మండలంలో వల్లభరావుపల్లి నుంచి చౌటకుంట తాండ మీదుగా వేముల వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.10.20 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది వంతెనల కోసం రూ.44.10 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ గత ఏడాదిలోనే మొదలైయిందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version