Collector Issues Show Cause Notice
అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి
అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి
మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.
