సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college
shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!