పగలు పాతఇనుపసామాన్లు,రాత్రి దొంగతనాలు
– వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
– దొంగిలించిన సొత్తు రికవరి
– వివరాలు వెల్లడించిన తొర్రుర్ డీఎస్పీ వెంకటేశ్వర బాబు
మరిపెడ నేటి ధాత్రి.
తొర్రుర్ డివిజన్ వ్యాప్తంగా ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొర్రుర్ డివిజన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. కేసులకు సంబంధించిన వివరాలను తొర్రుర్ డీఎస్పీ వెంకటేశ్వర బాబు డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం టీచర్స్ కాలనీకి చెందిన ఆవుల సంజీవ తండ్రి వెంకయ్య, నాగిళ్ల నాగరాజు, ఎడ్ల వెంకటమ్మ ఎడ్ల పున్నమ్మ, నాగిళ్ల దుర్గ, గోపగాని రాజమ్మ, మొండికత్తి కులానికి చెందిన వీరు కూలీ చేసుకుంటూ, అది దొరకని సమయంలో పాతఇనుప సామాన్లు సేకరించి విక్రయిస్తూ ఊరూరు తిరుగుతుంటారు. దొంగిలించిన సొత్తును కేతపల్లి మండలం చింతల పుల్లారావు పాత ఇనుప సామాను కొనుగోలు షాపునకు విక్రయించే వారని తెలిపారు. వారికి రోజుకు రూ.200, రూ.300 వస్తుండేవి. కానీ ఆ డబ్బులు వారి అవసరాలకు సరిపోయేవి కావని దీంతో సులభంగా డబ్బులు సంపాధించాలనే ఉద్దేశ్యంతో ప్లాస్టిక్ సామాన్లు, బీరుసీసాలు, వేరేందుకు వెళ్లె సమయంలో ఊళ్లలో తాళ్లం వేసి ఉన్న ఇళ్లలోని ఇత్తడి సామాన్లు, ఇనుప సామాన్లు, ఏమైనా ఉంటే వీటిని దొంగిలించుకు పోయేవారని డీఎస్పీ తెలిపారు. గతంలో పలు దొంగతనాలు చేయడంతో వీరి మీద నల్లగొండ జిల్లా, కేతిపల్లి పీఎస్ పరిధిలో, కట్టంగూరు పీఎస్ పరిధిలో, తుంగతూర్తి పీఎస్ పరిధిలో దొంగతనం కేసులు నమోదు అయి జైలుకు కూడ వెళ్లారు. మళ్లీ బయటకి వచ్చాకా అదే జిల్లాలో చేస్తే దొరికిపోతామని మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి, మరిపెడ, తొర్రూరు మండలాల వైపు దొంగతనాలకు పాల్పడ్డారు. గత ఏడాది జూన్ నుంచి తొర్రూరు మండలం మాటేడు శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, పెద్దము ప్పారం వెంకటేశ్వరస్వామి ఆలయం, మరిపెడ మండలం గుండెపుడిలోని సీతారామాస్వామి ఆలయం, అమ్మాపురం సీతారామ స్వామి దేవాలయల్లో, మరిపెడ, ఎల్లంపేట గ్రామ శివారు, జమ్మికుంట తండాల్లోని 25కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసిన కాపర్ వైర్ దొంగిలించారు. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో వీరు ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి ఆటో ట్రాలీ మహేంద్రా ఆల్ఫాఫస్ టీఎస్29టీ0717లో వచ్చి పైన తెలిపిన నేరాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా గురువారం ఉదయం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో దొంగిలించిన ఇత్తడి దేవుడి వాహన విగ్రహాలను తీసుకెళ్తుండగా పోలీసు వారు అంబేద్కర్ సెంటర్ తొర్రూరు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 45కేజీ కాపర్ వైర్, మరిపెడ మండలం గుండెపుడిలో దొంగిలించిన గరుడ వాహానం 60కేజీలు, అశ్వవాహానం 70కేజీ, ఆంజనేయస్వామి 40కేజీలు, ఇత్తడి గొడుకు 10కేజీలు, దివిటీలు 4కేజీలు, ఇత్తడి చెంబ్బులు 4కేజీలు వాహనాలు, తొర్రూరు మండలం అమ్మాపురం గ్రాము దేవాలయంలోని
హనుమంతుడి వాహానం 40కేజీలు, అశ్వవాహానం 40 కేజీలు, నగదు రూ.60,000 ఆటో ట్రాలీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు కె. జగదీష్, మరిపెడ ఎస్సై తహెర్ బాబా, రమేష్ పాల్గొన్నారు.