రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు.ఝరాసంగం గ్రామంలో ఉదయం,7.00 సాయంత్రం 10.00 వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంచుతున్నారని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ తెలిపారు.సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంట వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారుల డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
30 శాతం పంపిణీ పూర్తి
ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 15 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ ఆయన తెలిపారు.
ఝరాసంగం మండల కేంద్ర పరిధిలోని రేషన్ షాపుల్లో 30 శాతం పంపిణీ పూర్తయిందని అధికారి తెలిపారు.
దుకాణాల వద్ద క్యూ కడుతున్న లబ్ధిదారులు
సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.