రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్, ఎంపిడిఓ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరణపై ఐడిఓసి కార్యాలయం నుండి
మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పరిశ్రమలు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును
ఓబీఎంఎంఎస్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.
దరఖాస్తులు ఉచితంగా ఇవ్వాలని, విక్రయించొద్దని లబ్ధిదారులకు దరఖాస్తులు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని సూచించారు. ఎవరైనా దరఖాస్తులకు డబ్బులు తీసుకుంటే పోలీసు కేసు నమోదుతో పాటు శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తు దారులు దళారులను నమ్మొద్దని ఏదేని సలహాలు, సూచనలు కొరకు ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలని ఆయన తెలిపారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించడానికి ఈ నెల 14వ తేది వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ పధకం సమాచారం వివరాలు లబ్ధిదారులకు తెలిసేలా అన్ని ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హెల్ప్ డెస్క్ లు ద్వారా దరఖాస్తు చేయుటపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసేందుకు వచ్చే ప్రజల పట్ల సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని ఏదేని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు ఈ పధకానికి 4,479 దరఖాస్తులు వచ్చాయని, ప్రజలకు తెలిసేలా గ్రామ, గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. దరఖాస్తుకు జాతపరచాల్సిన దృవీకరణ పత్రాల సమాచారంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏ పధకానికి ఎలాంటి ఆధార పత్రాలు అవసరమో వివరంగా తెలియ చేయాలని సూచించారు. పథకానికి అవసరమైన పత్రాలు జాప్యం చేయకుండా ఆయా శాఖల అధికారులు తక్షణమే జారీ చేయాలని, జాప్యం చేయొద్దని సూచించారు.
అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. పథక సమాచారం ఇవ్వాలని, అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండల, మున్సిపల్ స్థాయిలో విచారణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఆర్డీఓ నరేష్, ఎస్సి, బిసి మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు సునీత, శైలజ, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.