అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం
మంత్రి శ్రీధర్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి:
ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి
దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.
పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.
శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.
మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.
సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.
యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.
ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.
12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.
ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.
ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు
కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.
ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…
కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.
ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.
రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.
సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.
మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.
రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.
కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.
పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.
వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.
పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.
ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.
దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.
దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.
ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.
అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.