నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.