
BC Rights Struggle Committee
తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టిన బీసీ హక్కుల పోరాట సమితి
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర శనివారం రోజున జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.నాయకులు మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బిసి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి.అలాగే దేశంలోని తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేదో బీసీ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం అత్యంత బాధాకరమని,దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారని,దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందని, ఇంకెంతకాలం బీసీలకు అన్యాయం చేస్తారని,ఇదేనా ప్రజాస్వామ్యం,ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనీ,ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని,లేని పక్షంలో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,కర్రె లచ్చన్న సీనియర్ రాష్ట్ర నాయకులు,గజెలి వెంకటయ్య జిల్లా కార్యదర్శి,శాఖపురి భీమ్సేన్,నాయకులు అంకం సతీష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.