ప్రభుత్వ భూములను పరిరక్షించండి.
నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి :
నాగర్కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాలలో కుంటల ఆక్రమణలు,చెరువు శికం భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానిక సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ పట్టణం కొత్త జిల్లా గా ఏర్పడిన నాటి నుండి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా వరకు కుంటలు,చెరువు శిఖం భూములు ఆక్రమణలు జరిగినట్లు వివిధ పత్రికలలో వార్తలు వినపిస్తున్నాయని ఇట్టి భూఆక్రమణల పై గతంలో కలెక్టర్ కూడ నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులను ఆదేశించినా చర్యల విషయంలో అధికారాలు,ఆధారాలు ఉన్నా ఆలస్యం చేస్తూ నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,పట్టణ ప్రజలకు,రైతులకు మేలు చేసే చెరువులను, కుంటలను కాపాడవలిసిన తక్షణ కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందని ప్రకృతి వనరులను రాజకీయ అండదండలతో చెరబట్టి ధ్వంసం” చేసి కాంక్రీట్ జంగిల్ గా కందనూలు చెరువు”లను మారుస్తున్నా.జిల్లా ఉన్నతాధికారుల లో ఏమాత్రం చలనం కలగడం లేదని వాపోయారు.
జల వనరులను ఎవరు ఆక్రమించుకున్నా విచక్షణాధికారం ఉపయోగించి ప్రభుత్వ ఆధీనం లోకి తెచ్చుకునే అవకాశం ఉన్నా,ఆ దిశగ ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఆక్రమణలపై కోర్టుకేసులు ఉన్నా కబ్జాదారుల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేసే అధికారం జిల్లా ఉన్నతాధికారులకు ఉందని,ప్రజల ఆస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లినా,తమ అధికార దండాన్ని ఉపయోగించే అవకాశం ఉన్నతాధికారులకు ఉన్నా చర్యలు తీసుకోకుండా..

ప్రేక్షక పాత్ర వహిస్తే,మిగిలిన ప్రభుత్వ భూమి కూడ కబ్జా ల పాలుకావడంతో పాటు భవిష్యత్తు తరాలకు తీరని నష్టం”చేసిన వారు అవుతారాని సూచించారు.చెరువు బఫర్ జోన్, శిఖం పరిధి లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చట్టంలో ఉన్నా భూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కుంటలను ధ్వంసం చేస్తూ,చెరువు శిఖం భూములలో నిర్మాణాలు చేసిన వారిపై పీ.డి యాక్ట్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టాల్సిందిగా పిర్యాదు లో విజ్ఞప్తి చేసారు.