-నేతలు..జాతకాలు..ఉగాది సంబరాలు.
-ఒక్కో పంతులు ఒక్కో జోస్యం.
-పంచాంగ లెక్కలందరూ ఒకటే చెబుతారు.
-అది ప్రామాణికమని అందరూ నమ్ముతారు.
-జాతకాల విషయంలో ఎవరికి తోచింది వారు చెబుతారు.
-నాయకుల చేత జేజేలు కొట్టించుకుంటారు.
-ఉగాది సాక్షిగా పండగ రోజే ఇన్ని అబద్దాలా!
-తొలి రోజే లెక్కలేనన్ని అసత్యాలా!
-జోస్యం ఎవరికైనా ఒకటే వుండాలి.
-పార్టీల పరిస్థితి నిజాయితీగా చెప్పగలగాలి.
-నిజం చెబితే సంభావన కష్టం. నిజం నిష్టూరం.
-కష్టాల గురించి చెబితే వచ్చే ఉగాదికి పిలువరు.
-ఎవరి కష్టాలు వారివి…పంతుళ్ల తిప్పలు పంతుళ్లవి.
-తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి కి తిరుగులేదంటారు.
-వచ్చే సారి కూడా రేవంత్ రెడ్డే సిఎం అని ఓ పంతులు చెప్పాడు.
-మూడు నెలల్లో కేసిఆర్ సిఎం అవుతారని మరో పంతులంటారు.
-తెలంగాణ వచ్చే ఎన్నికలలో బిజేపి గెలుస్తుందని మరో పంతులు చెబుతాడు.
-చంద్రబాబు ఆరు సార్లు సిఎం అవుతారని అక్కడంటారు.
-వచ్చేది జగనే మరో పంతులు సెలవిస్తాడు.
-పవన్ కళ్యాణ్ ఇంకా పదిహేనేళ్లు చంద్రబాబు వుండాలంటాడు.
-పంతులేమో పవన్ కళ్యాణ్ సిఎం అవుతారని అంటారు.
-ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం వుంది.
-ఈ ముచ్చట్లు ఇప్పుడెందుకు చెబుతారో అర్థం కాదు.
-గతంలో కాలాల గురించి మాత్రమే చెప్పే వారు.
-గ్రహ గతుల వల్ల ప్రాంతాలకు ఎదురయ్యే సమస్యలు ప్రస్తావించే వారు.
-ప్రతి సారి వర్షాలు విపరీతంగా కురుస్తాయంటారు.
-కరువొచ్చిన కాలంలో కూడా ఇలా చెప్పే ఊరడిరచారు.
-విని సంతోషించాలనే పంచాంగ శ్రవణం అంటారేమో!
హైదరాబాద్,నేటిధాత్రి:
మారేదే అయితే జాతకమెలా అవుతుంది. కలిసొచ్చేదే అదృష్టమైతే ఎందుకు దాగి వుంటుంది. లాక్కొచ్చి పరిహారం చెల్లిస్తేగాని పని చేయనిది భవిష్యత్తు ఎలా అవుతుంది. బతుకు జీవుడా అని ఏళ్లకేళ్లు బాదించి, ఆఖరుకు కలిసొస్తే అది కలిసొచ్చే కాలమెలా అవుతుంది. బతకలేని బతుకులు బతుకంతా ఏడిపించి, కన్నీళ్లను కూడా మిగల్చకుండా చేస్తుంటే అది బతుకెలా అవుతుంది. భగవంతుని కరుణెలా అవుతుంది. నమ్మకం మన బలం. ఆ నమ్మకమే కొంపలు ముంచడం..చదువుకున్న వాళ్ల మూడత్వం..ఈ జన్మకే దిక్కులేని సంబరం..ఏడేడే జన్మలు తెచ్చేదంతా ఆనందం. అంటే ఎవరైనా సంతోషిస్తారా? వచ్చే జన్మ కోసం ఈ జన్మంతా కష్టపడతారా? దేవుణ్ణి తిట్టుకోకుండా వుంటారా? ఈ జన్మకు మోసిన కష్టాలు..మళ్లీ జన్మొద్దు. ఈపుట్టకే వద్దనే కదా? కైలాసం కోరుకుంటారు..అలాంటి వారిలో ఆశలు నింపడం కోసమే జ్యోతిష్యులుంటారు. వారి ప్రాపకం గడుపుకుంటారు. ఆశలో జీవి జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ పాండిత్యం వున్న పండిత సిద్దాంతులు పడే యాతన అంత ఇంతా కాదు. ఏ పార్టీ పంచాంగ శ్రవణానికి వెళ్తే ఆ పార్టీ గొప్పదని చెప్పకుండా వుండలేరు. ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలు చెప్పిన సిద్దాంతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ఒకటే. పాలన ఒకటే. కాని రాజకీయాల మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాలుగా చెప్పారు. అందరూ అన్ని పార్టీల జాతకాలు అద్భుతమనే అన్నారు. మరి అన్ని పార్టీల జాతకాలు అధ్భుతమే అయినప్పుడు అన్ని పార్టీలు గెలవలేవు. ఏదో ఒకపార్టీ మాత్రమే గెలుస్తుంది. అన్ని పార్టీలకు ఆ అవకాశం లేదు. కాని చెబుతారు. పార్టీలను నమ్మిస్తారు. నాయకులను రంజింప జేస్తారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురించి సంతోష్ కుమార్ శర్మ చెప్పిన జాతక ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాం. రేవంత్ రెడ్డిది తులా రాశి అని చెప్పుకుంటూ ఆయనకు నరగోష వుందన్నారు. ఆయనపై నరఘోష చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఆయనపై ఎప్పటి నుంచో వుందనే చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి పంచాంగమే అక్కర్లేదు. ఎందుకంటే రేవంత్రెడ్డి స్వతహాగా పైకొచ్చిన నాయకుడు. ఆయనను ఎవరూ నాయకుడిగా తయారు చేయలేదు. రాజకీయ గురువు ఆయనకు ఎవరూ లేరు. ఒక్కసారిగా రాజకీయ యవనిక మీదకు ఉత్తుంగతరంగంలా వచ్చారు. వస్తూ వస్తూనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ అయ్యారు. మరో రెండేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీలో అందరూ అసూపడేలా ఎదిగారు. చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షుడు కావాలనుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్దితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా వర్కింగ్ ప్రెసిడెంటుగానే తన ప్రస్దానం ప్రారంభించారు. గత ఎన్నికలకు మూడేళ్ల ముందే పిపిసి. అధ్యక్షుడయ్యారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై నరదిష్టి అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుగుతున్న క్రమంలోనే మొదలైంది. ఏ నరదిష్టి ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే జాతకం బాగుంది. అసలు ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతా! అన్నారు. అప్పటికి తెలంగాణ రాలేదు. ఒక్కరోజైనా సరే నేను ముఖ్యమంత్రికావాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ వచ్చిందే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసమా? అన్నట్లు ఆయన జాతకం కాలాన్నే మార్చేసింది. ఇప్పుడుకొత్తగా ఆయనపై దిష్టి వుందన్న సంగతి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కాని చెప్పాలి. చెప్పకుంటే పంచాంగ శ్రవణం పూర్తికాదు. అందుకే ఓ వైపు రేవంత్రెడ్డికి తిరుగులేదు. ఎదురులేదు. మరో పదేళ్లపాటు ఆయన పాలనకు తిరుగుండదని చెప్పిన సిద్దాంతి నరోఘోష వుందని పరిహారం చేసుకోవాలని సూచించారు. అందరిలోనూ ఆనందం నింపారు. ఇది నిజమా? అబద్దామా? అనేది కాలం తేల్చుతుంది. ఇక బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో మరో విశేషం జరిగింది. ఇకపై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్దే గెలుపు అంటూ సిద్దాంతి చెప్పుకోచ్చారు. ఇంత వరకు బాగానే వుంది. మరి ప్రభుత్వం తరుపున పంచాంగ శ్రవణం చెప్పిన సిద్దాంతి సిఎం. రేవంత్ రెడ్డికి పదేళ్లపాటు తిరుగులేదన్నాడు. మరి బిఆర్ఎస్ జాతకం చెప్పిన సిద్దాంతి ఈసారి సిఎం. అయ్యేది కేసిఆరే అంటున్నారు. ఇదెలా సాధ్యం. లెక్కలంటే లెక్కలాగానే వుండాలి. పక్కాగా వుండాలి. లెక్కలకు సూత్రాలెన్ని వున్నా, ఆన్సర్ మాత్రం ఎప్పుడూ ఒక్కటే వుండాలి. ఒకే లెక్కను సూత్రానికొక సమాధానం వస్తే అది లెక్కెలా అవుతుంది. దానికి విలువేమిటుంటుంది. ఇక బిజేపి కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఇక వచ్చేదంతా బిజేపి కాలమే అని సిద్దాంతి సెలవిచ్చారు. అదేంటి ఒకే రాష్ట్రంలో మూడు పార్టీల జాతకం బాగానే వుంది. కాని అదికారం ఏదో ఒకపార్టీనే వరిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదికారంలో వుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఎంగా వున్నారు. ఆయన పదవికి పదేళ్లు ఢోకాలేదన్నప్పుడు, ఈ రెండు పార్టీలు ఎలా అదికారంలోకి వస్తాయో? అర్ధం కాని విషయం. అయినా ఎన్నికలు మరో ముడున్నరసంవత్సరాలకు గాని రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికల వస్తే అని సర్వే సంస్ధలు చెప్పినట్లు జోస్యం చెబితే పంచాగానికి విలువేముంటుంది. పంచాంగం అంటే అన్నీ నిజాలే చెప్పాలి. సిద్దాంతులు అదే చెప్పాలి. గ్రహగతులు అన్ని పంచాంగాలలో ఒకటే వుంటుంది. ఎప్పుడు పౌర్ణమివస్తుందో..ఎప్పుడు గ్రహణాలు వస్తాయో? లెక్క పొల్లు పోకుండా పంచాంగంలో రాస్తారు. ఇప్పటికీ సైన్స్కు అందని మిస్టరీ. అంత కరక్టుగా పంచాంగం రూపకల్పన జరిగినప్పుడు నేతల జాతకాలు, పార్టీల భవిష్యత్తును ఇలా మర్చి చెప్పిడం కరక్టు కాదు కాదా? నిజం చెప్పాలంటే సిద్దాంతుల విజ్ఞానం సామాన్యమైంది కాదు. ఎంతో విద్వత్తు వుంటే గాని సిద్దాంతులు కాలేరు. మరి అలాంటి సిద్దాంతులు ఉగాది పూట ఎందుకు అబద్దాలు చెప్పడం. ఉన్నది ఉన్నట్లు చెబితే జనం నమ్మరు. అంతా బాగుందంటేనే నమ్ముతారు. వ్యక్తిగా కష్టాలొస్తాయంటే నమ్ముతారు. కాని రాజకీయాల్లో వున్నవారు పదవులు పోతాయంటే జీర్ణించుకోలేరు. అందుకే సిద్దాంతులు కూడా లోకకల్యాణం కోసమే అబద్దాలు ఆడుతుంటారేమో? అనుకోవాలేమో?? ఇక ఏపిలో మాడుగుల నాగఫణి శర్మ లాంటి గొప్ప సిద్దాంతి కూడా చెప్పింది వింటే విచిత్రమనిపిస్తుంది. అదేంటో సిద్దాంతులు సామాన్యులను కష్టాలున్నాయని భయపెడతారు. నాయకులకు అంతా బాగుందని చెప్పి సంతోషపెడతారు. మీరు పదవిలో నుంచి దిగిపోతారని ఏ నాయకుడి ముందు, ఏ సిద్దాంతి చెప్పరు. ఇదే అసలు ట్విస్టు. ఏపి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తంగా ఆరు సార్లు ముఖ్యమంత్రి యోగముందని నాగఫణిశర్మ చెప్పారు. ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి చేశారు. ఇంకా రెండుసార్లు మిగిలి వుంది. మరి స్వయంగా మంత్రి లోకేష్ ఆ మధ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్సీలకైనా మూడుసార్లే అవకాశం. నేను కూడా అదే ఆచరిస్తానని చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు వర్తింపజేస్తారా? అంతే కాకుండా లోకేష్ అప్పటి వరకు ముఖ్యమంత్రికాకుండా వుండగరలా? ఇదిలా వుంటే పవన్ కల్యాన్కు కూడా రాజయోగం వుందని సిద్దాంతులు అంటున్నారు. పవన్ కల్యాణేమో చంద్రబాబుమరో మూడుసార్లు సిఎంగా వుండడమే నేను కోరుకుంటున్నానంటున్నారు. జాతకం ప్రకారం ఆరుసార్లు సిఎం. చంద్రబాబు అయ్యే అవకాశంవుంటే పవన్కు సిఎం.అయ్యే చాన్స్ లేనట్లే. మరి ఇతర సిద్దాంతులు పవన్కు ఆ వరం వుందంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ విషయానికి వస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తారని పంచాంగ సిద్దాంతి సూరి నారాయణ మూర్తి అన్నారు. అదెలా సాధ్యమౌతుంది. వరుసగా ఇంకా రెండు సార్లు చంద్రబాబు సిఎం. అయ్యేదే వుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ఎలా సిఎం అవుతారు. అసలు అక్కడ కూడా ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం వుంది. కూటమి బలంగా వుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువచ్చే అవకాశమే లేదు. ఇకపోతే జగన్ విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలంత కీర్తిని సంపాదిస్తారట. ఇలా పంతుళ్లు పోటీ పడి మరి నాయకులను కీర్తించారు. గతంలో ఎప్పుడు పంచాంగ శ్రవణాలు చెప్పినా నాయకుల జాతకాలు చెప్పేవారు కాదు. వాతవారణ పరిస్ధితులు, భూకంపాలు, వర్షాలు, వరదలు, కరువు కాటకాల గురించి చెప్పి, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు నాయకులు జాతకాలు చెప్పి వారిని సిద్దాంతులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదీ మ్యాటర్.