
-వైస్ ఎంపీపీ పోలింగ్ రాజేశ్వర్ రావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 26
ప్రస్తుతం ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి ఆదేశాల మేరకు సబ్ సెంటర్ డాక్టర్ రాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డాక్టర్ల సూచనల మేరకు వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలని, కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈగలు దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు వహించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 52 మందికి వైద్య పరీక్షలు చేసి, ఇద్దరు జ్వర పీడుతులను గుర్తించి వారి రక్తనమునాలను సేకరించడం జరిగిందని డాక్టర్ రాణి తెలిపారు. అనంతరం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందిచే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం షబేదా, ఆశ వర్కర్లు భారతి, కృష్ణవేణి, శోభ, సౌందర్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.