ప్రజాపాలనా గందరగోళంలో ప్రజలు నిద్రవస్థలో ఎంపీడీఓ కార్యాలయం
పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్
హన్మకొండ :నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక కార్యక్రమం ప్రజల సమస్యలను పరిష్కరించే కార్యక్రమంగా కాకుండా కేవలం ప్రచార కార్యక్రమంగా మారిపోయిందని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.
ప్రభుత్వం 99 రోజుల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పుకుంటున్నా, ఇండ్ల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. మంజూరైన లబ్ధిదారులు వ్యక్తిగత కారణాలతో ఇల్లు నిర్మించుకోలేకపోతే, ఆ అవకాశం మరో అర్హుడైన దరఖాస్తుదారునికి ఇవ్వాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉంది. కానీ మండల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి ప్రధాన కారణం అవగాహన లేని ఇందిరమ్మ కమిటీలే
మండల గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు (జీరో బిల్లు) ఎంతమందికి లభించింది అనే విషయంపై స్పష్టత లేదు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు నష్టపోయారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?
వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ మంజూరు కాకపోవడం బాధాకరం. పేదల కోసం ఉన్న పథకాలు పేదలకు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమే.
పారదర్శకత కలిగిన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మండలంలో కొన్ని గ్రామాలకు మాత్రమే ఈజీఎస్ నిధులు మంజూరు చేసి, మరికొన్ని గ్రామాలను పూర్తిగా పక్కన పెట్టడం సవతి ప్రేమ కాదా? ఈ వివక్ష వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి.
ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక కార్యక్రమాల్లో ప్రజలు తక్కువగా, ప్రభుత్వ ప్రతినిధులు ఎక్కువగా కనిపించడం ఈ కార్యక్రమం ప్రజల కోసం కాదని, కేవలం ప్రభుత్వ ప్రచారం కోసమే నిర్వహిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచారం మానేసి, ప్రజల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
లేకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతం అన్నారు.
