పారితోషికం తిరిగిచ్చేసిన పవన్కల్యాణ్
సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్ హీరోలు. Some heroes liked the story and made films without taking any remuneration.. but suffered losses after the film was released.
- అదే బాటలో సిద్ధు జొన్నలగడ్డ
సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్ హీరోలు. కథ నచ్చి, పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన హీరోలు కొందరైతే.. చిత్రం విడుదలయ్యాక నష్టాలొస్తే తాము తీసుకున్న రెమ్యునరేషన్ను వెనక్కి ఇచ్చిన వారు మరికొందరు. అయితే చిత్రసీమలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఏ.ఎమ్.రత్నమ్ నిర్మాత. క్రిష్ దర్శకత్వంలో 2020లో మొదలైన ఈ చిత్రం పలు కారణాలతో సుదీర్ఘ కాలం పాటు సెట్స్లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు తాను అడ్వాన్స్గా తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. ఇంతకాలం ఈ సినిమా సెట్స్ పైనే ఉన్నందుకు నిర్మాతపై పడ్డ అదనపు భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారని నిరూపించుకున్నారు. మరో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘జాక్’ ఏప్రిల్ 10న విడుదలైంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో పారితోషికంగా తాను తీసుకున్న మొత్తంలో సగం(రూ. నాలుగు కోట్లు) తిరిగిచ్చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.

షూటింగ్కు సిద్ధం
పవన్కల్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. హరీశ్ శంకర్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి మొదలవుతోందని మంగళవారం తిరుమలలో వెల్లడించారు ఆయన. త్వరలోనే పవన్కల్యాణ్ కూడా సెట్స్లోకి అడుగుపెడతారని తెలిపారు.