*కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలి..
*అమాయక గిరిజనుల ప్రాణాలను కాపాడాలి..
*సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరత్నం డిమాండ్..
తిరుపతి(నేటి ధాత్రి) మే 02:
తెలంగాణ
చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలని సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ ను నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ మోది నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్రం సాయుధ బలగాలను రంగంలో దింపి అడవులను జల్లెడ పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక గిరిజనులు తూటాలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల దాష్టికాన్ని తట్టుకోలేక గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్న అమాయకులను బలి తీసుకోవడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజ సంపాదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి.లోకేష్, పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ అలాగే వెంకటేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..