గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
-రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం
-గడ్డం కేశవామూర్తికి ఎన్టీఆర్ అవార్డు రావడం హర్షనీయం
-సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంచలన రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డును ఆయన పొందారు. విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రధానం చేసింది.
గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి మెమొంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.
అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు. పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు.
వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం కేశవామూర్తి అన్నకు ఈ అవార్డు రావడం హర్షనీయమని, జర్నలిస్టులకు ఎంతో గర్వకారణమని, ప్రస్తుతం రాణిస్తున్న జర్నలిస్టులకు ఆయన స్ఫూర్తిదాయకమని సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ ఆయన సేవలను కొనియాడారు.