హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటల్స్ లోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండు.. అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావ్ అనుకునే పరిస్థితి ఉండగా.. కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి నెలకొంది.
సిటీలో అనేక హోటళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిర్వహణ సరిగా లేదు. ఎక్స్ పైరీ అయిన సరుకులనే వినియోగిస్తున్నారు. కిచెన్ ఏరియా, వాష్ రూమ్ ఏరియాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఏమాత్రం పరిశుభ్రత లేదు. అవన్నీ కూడా ఇన్ ఫెక్టెడ్ పరిసరాలుగా మారిపోయాయి. ఎలుకలు, బొద్దింకలు, ఈగలు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, స్టేట్ ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నగరంలోని వివిధ హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు.
వీరి తనిఖీల్లో ఈ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఓనర్లు లేకుండా పని వాళ్లలో నిర్వహించే హోటల్స్ లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. తినే ఆహార పదార్దాలు, ఉపయోగించే కూరగాయలు, సరుకులు ఎలా పడితే అలా పడేశారు. అవన్నీ కూడా బూజు పట్టిన స్థితిలో ఉన్నాయి. వాటినే తీసుకుని ఆహార పదార్దాల తయారీకి వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. హోటల్స్ కిచెన్ లలో వెలుగుచూసిన దారుణాలు.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి హోటల్స్ కి వెళ్లి తింటే మా పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇలాంటి చోట్ల తింటే రోగాలు రావడం ఖాయం అంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి హోటళ్ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.