గుళికల యూరియా వద్దు నానో యూరియా ముద్దు
పి హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.
కాశిబుగ్గ నేటిధాత్రి.
గీసుగొండ మండలంలో 14,000 ఎకరాలకు పైగా సాగవుతున్న పత్తి పంటకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన 135 కిలోల యూరియా మోతాదును 4 భాగాలు చేసి వేసుకోవాలని,మొదటి 5 రోజుల్లో 25%,తర్వాత 20-25 రోజుల వ్యవధిలో,మూడు సార్లు సమాన మోతాదులో, మిగతా 75% యూరియా వేసుకోవాలి.అలాగే వరి పంటకైతే 96 కిలోలు మూడు భాగాలు చేసుకొని వేసుకోవాలి.వరి నాటు వేసిన 15 రోజులకు 30 కిలోలు,30 రోజులకు 35 కిలోలు,చిరు పొట్ట దశలో 31 కిలోలు వాడాలని తెలిపారు.
పైన తెలిపిన యూరియాను గుళికల రూపంలో (45 కిలోల బ్యాగ్స్) వాడటం తగ్గించి, ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చిన నానో ప్లస్ ద్రవరూప యూరియాను ఒక అర లీటర్ ఒక ఎకరానికి నేరుగా స్ప్రేయర్/డ్రోన్ తో గాని పిచికారి చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఎందుకంటే నానో ప్లస్ ద్రవ రూప యూరియాను వాడటం వలన చాలా లాభాలు కలిగి ఉన్నాయి.
⏩సాధారణ యూరియా తో గ్రీన్ హౌస్ వాయువు(నైట్రస్ ఆక్సైడ్) విడుదలై భూమి వేడెక్కడమే కాక వర్షపు నీటితో కలిసి జల కాలుష్యం కు కూడా జరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది.అదే నానో యూరియా వాడితే 40% వరకు వాతావరణ,నీటి కాలుష్యం తగ్గించవచ్చు.
⏩ వరి ఆకుల పైన ఈ ద్రవరూప యూరియా వెంటనే పూర్తిగా వ్యాప్తి అయ్యి, అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న నత్రజని వేగంగా గ్రహించబడి,వినియోగ సామర్థ్యం (80-90%) అత్యధికంగా ఉండి,మొక్క ఆరోగ్యవంతముగా పెరుగుదల ఉండి,సరియైన నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయని తెలిపారు.(అదే 45kg ల యూరియా బ్యాగ్ వేస్తే 40% మాత్రమే మొక్కకు వేర్ల ద్వారా చేరుతుందని ఇక్కడ రైతులు గమనించాలని కోరారు).
⏩నానో ప్లస్ ద్రవరూప యూరియా వాడడం వల్ల నేల స్వభావం,రసాయన-జీవ వాతావరణం,మిత్ర కీటకాలు వృద్ధి చెందడం పై ఏవిధమైన చెడు ప్రభావం ఉండదు.
⏩నత్రజని మొక్క వేళ్ళకు అందకుండా నేల లోపలికి ఇంకిపోయే నష్టం ఉండదు.
⏩ఇట్టి నానో ప్లస్ ద్రవరూప యూరియాను పై రెండు పంటలేకాక మొక్కజొన్న , ఎండుమిరప, పప్పు దినుసులు & ఇతర అన్ని పంటల పైన పిచికారి చేసుకొనవచ్చు అని అన్నారు.
కాబట్టి, పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు అవసరం మేరకే యూరియాను మరియు ఇతర రసాయన ఎరువులను వేసుకోవాలి. పర్యావరణాన్ని, జలాశయాలను విషపూరితము చేస్తున్న గుళికల రూపంలోని యూరియా వాడకం తగ్గించి నానో సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన యూరియాను విరివిగా వాడాలని కోరారు.
శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు పైన చేప్పిన సూచనలను రైతుసోదరులు గమనించి,అర్థం చేసుకొని, సహకరించి పాటించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
పి.హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి