కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు
ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ?
అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-
ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి ఖమ్మరి వారి కుంట కింద ఉన్న వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లాల్సిన దారికి వాహనాలు దిగకుండా చేశారని బాధ పడాలో అర్ధం కాని అయోమయంలో ఆ ఏరియా రైతులు ఉన్నారు. రోడ్డు పోసిన అధికారులు,కాంట్రాక్టర్లు ప్రధాన రహదారికి లింక్ గా ఉన్న మట్టి బాటకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును ఏటవాలుగా చేయడం మర్చి పోయారు. రోడ్డు వేసి చాలా రోజులు అవుతున్నా కనీసం ఇబ్బంది ఉన్నచోట మట్టి కూడా పోయలేదు. దాంతో అటుగా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే ద్విచక్ర వాహనదారులు రాత్రి పూట వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవేవి పట్టించు కోకుండా అధికారులు రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. మరి ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప వారు స్పందించేలా కనిపించడం లేదు అని స్థానికులు వాపోతున్నారు.