దొరికేదాక సుద్దపూసలు! దొరికినంక ఎడ్డిపూసలు!!

https://epaper.netidhatri.com/view/271/netidhathri-e-paper-22nd-may-2024%09

 

`కుర్చీలో కూర్చున్నప్పుడు అహం.

`అధికారులమని అహంకారం.

`మాకంటే ఎవరు గొప్ప అని గర్వం.

`ప్రజలంటే లెక్క లేని తనం.

`ఆఫీసులకు వెళ్తే చిన్నచూపు చూడడం.

`ప్రతి పనికి లంచం…లంచం.

`సంతకానికి బేరం లేని ప్రతి ఫలం.

`పేదలైనా సరే లక్షలిస్తేనే కనికరం.

`పట్టు పడితే అమాయక ముఖం.

`వెక్కివెక్కి ఏడ్వడం…

`అయినా అవినీతి బుద్ది మానం.

`ఎంత మంది పట్టుబడుతున్న అధికారుల్లో కనిపించని భయం.

`మహా నటులను మించిన నాటకం.

`మాకేం తక్కువ అన్నట్లు పట్టుబడుతున్న మహిళాధికారులు.

`మేమేం తక్కువ అన్నట్లు లంచాలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

లంచం ఇవ్వడం..పుచ్చుకోవడం రెండూ నేరమే! ఈ విషయం అధికారులకు తెలుసు. కాని లంచం తీసుకోకుండా పనిచేయలేనంత స్ధాయికి చేరుకున్నారు. అయితే అందరు అదికారులు అలా లేరు. కాని కొంత మంది మూలంగా మొత్తం వ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. పైగా దొరికినప్పుడు కదా? అని అలవాటు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగలు దొరికిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి బాగా అలవాటు పడిన అధికారులు, ఇప్పుడు కూడా అదే కొనసాగించాలని చూస్తున్నారు. అదేంటో గాని గత ప్రభుత్వ హాయాం ప్రెండ్లీ రిలేషన్‌ పేరుత వారికి విపరీతమైన స్వేచ్ఛనిచ్చింది. దాన్ని అధికారులు దుర్వినియోగంచేశారు. ఇంతలో రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ధరణి లాంటివి రావడంతో అధికారుల పంట పండిరది. రాష్ట్రంలో పడావు పడి వున్న భూములు సాగులోకి రావడం పెద్ద ఎత్తున జరిగింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటి వ్యవస్ధలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం వంటివాటితో నీటి సౌలభ్యం పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం వచ్చింది. దాంతో భూములకు రెక్కలొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన భూమి తెలంగాణగా మారింది. కేసిఆర్‌ తెచ్చిన భూ లెక్కలు, వాటి స్ధిరీకరణ వంటి వాటి కోసం తెచ్చిన ధరణ అధికారులకు కల్పవృక్షమైంది. దానికి తోడు పెద్దఎత్తున భూముల లావాదేవీలు పెరిగాయి. హైదరాబాద్‌ విస్తరించింది. రాష్ట్రంలోని ఇతర పట్టణాలు విస్తరించాయి. జిల్లాల సంఖ్య పెద్దఎత్తున పెంచడం, పరిపాలన మరింత చేరువ కావడంలో ఆయా నగరాల్లోనే కాకుండా, పల్లెల్లో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్‌ వల్ల పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని గత ప్రభుత్వం అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖలకు పని విభజన వల్ల కూడా మరింత దోపిడీ పెరిగింది. భూమలు విషయంలో సంతకాలకు,పాస్‌ బుక్కుల పేరు మీద లక్షలు దోచుకునే అవకాశం ఏర్పడిరది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ అవినీతి పెరగానికి ఆస్కారమేర్పడిరది. రెవిన్యూ నుంచి మొదలు అన్ని శాఖల్లో కొంత మంది అధికారుల ఆదాయం చూసి, ఇతర శాఖలు కూడా మాకేం తక్కువ, మేమేం తక్కువ..మేమెందుకు దోపిడీ చేయొద్దన్నంతగా అవినీతికి పాల్పడం అలవాటు చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఎంత పెద్ద అవినీతి చేస్తున్నారని ఎన్ని పిర్యాధులు అందినా పట్టించుకున్నవారు లేరు. పైగా మీడియా వార్తా కథనాలు రాస్తే తిరిగి వారి మీదే కేసులు నమోదు చేసే స్ధాయికి చేరుకున్నారు. దాంతో మీడియా కూడా కొంత చూసీ చూడనట్లు వ్యవహరించింది. కాని రాష్ట్ర పాలనలో మార్పు వచ్చింది.
బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ వచ్చింది. అయితే మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే తమ ఆటలు సాగవని కొత్త ఎత్తుగడ వేసిన ఉద్యోగులు ఈసారి మార్పులో వారు కూడా పాలు పంచుకున్నారు. దోపిడీకి మరింత తెగబడ్డారు. ఈ శాఖ, ఆశాఖ అన్న తేడా లేకుండాపోయింది. రెవిన్యూ, మున్సిపల్‌ , విద్యాశాఖ, రిజిస్ట్రేషన్‌, ఆఖరుకు వైద్య శాఖలో కూడా పెద్దఎత్తున అవినీత చోటు చేసుకుంటోంది. కారణం అధికారుల్లో విపరీతమైన అహంకారం పెరిగిపోయింది. కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మాటల్లో చెప్పలేనంత ఘోరంగా వుంటోంది. ఒక తహసిల్ధార్‌ తన కార్యాలయంలో ఫోన్‌ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. బైట ఎంతో మంది ఆయన కోసం నిరీక్షిస్తుంటారు. అయినా ఆయన పిలుపు రాదు. అదేమంటే బిజీగా వున్నారు. పై అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక వారంలో కార్యాలయానికి వచ్చేది ఎన్ని రోజులన్నది ఎవరూ చెప్పలేరు. సమీక్షల పేరుతో కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారని, లేకుంటే ఆర్డీవోతో సమావేశంలో వున్నారనే సమాదానాలు ఎక్కువగా వినేలా చేస్తారు. దాంతో పనుల కోసం తిరిగి తిరిగి వేసారిన వాళ్లు అక్కడున్న అటెండర్లకు సమాచారమిస్తారు. అప్పుడు అయ్యవారు కనికరిస్తారు. లేకుంటే అధికార పార్టీ నాయకులు చెప్పింది చేస్తారు. ప్రజలకు దర్జాగా అన్యాయం చేస్తారు. పై స్దాయి నుంచి కింది స్ధాయి దాకా అవినీతి మరక లేని అధకారులు చాల తక్కువ. దొరికిన వాళ్లు మాత్రమే దొంగలు. కాని దొరక్కుడా అతి జాగ్రత్తపరులుగా చెలామాణి అవుతున్నవారు చాలా మంది వున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు. దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా సంపాదనకు ఎగబడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రస్తక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రజా పాలనతో అవినీతికి ఆస్కారం లేదని చెప్పినా అధికారులు వినడం లేదు. గతంలో ఏసిబి స్పందన అంతంత మాత్రంగా వుండేది. ఇప్పుడు ఏసిబి మరింత దూకుడు పెంచింది. అయినా ఇది సరిపోదు. ఇంకా దూకుడు పెంచాలి. అవినీతి పరులను పట్టుకోవాలి. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి.
నిత్యం ముగ్గురు నలుగురు అధికారులు పట్టుబడుతున్నారు. అయినా ఎవరూ భయపడడం లేదు. కేసులౌతాయన్న భయమే కనిపించడం లేదు. జైలు జీవితం అనుభవించాల్సివస్తుందన్న ఆందోళనే లేదు. ఎలాగూ బెయిల్‌ వస్తుంది. మళ్లీ బైటకు వస్తాం. వ్యవస్ధలను మేనేజ్‌ చేసుకుంటాం. ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం. మళ్లీ అవినీతితో పెట్టిదానికి పదింతలు సంపాదించుకుంటామన్న నమ్మకం అదికారుల్లో పెరిగిపోయింది. అసలు ఏసిబి అంటేనే ఒక రకంగా పోలీసు వ్యవస్ధతో సమానం. వాళ్లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత మళ్లీ విచారణల పేరుతో కాల యాపనలు చేయడం ద్వారా అవినీతి అదికారులకే మేలు జరుగుతోంది. చివరికి కోర్టులో కేసులు నిలబడం లేకుండాపోతున్నాయి. పట్టుకోవడం వరకే మా పాత్ర..తర్వాత మాకు సంబంధం లేదకునే అలసత్వం ఏసిబిలో కూడా కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏసిబి పట్టుకున్న తర్వాత కూడా మళ్లీ అధికారులకు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి? అన్నదానికి ఎవరి వద్దా? సమాధనం లేదు. అందుకే అధికారులు భయపడంలేదు. ఏసిబికి పట్టుబడడం కూడా వెకేషన్‌ టూర్‌లాగా మారిపోయింది. ఎందుకంటే కోర్టు ద్వారా తిరిగి ఉద్యోగం తెచ్చుకోవడమే కాకుండా, ఇంట్లో కూర్చున్నన్ని రోజులు జీతాలు కూడా అందుతాయి. దాంతో పని చేయాల్సిన అవసరం లేదు. జీతం నష్టం జరిగే అవకాశం అసలే లేదు. అందుకే అందిన కాడికి దండుకోవడం అలవాటు చేసుకున్నారు. రోజూ జేబు నిండకుండా ఇంటికి పోవడం లేదు. ముఖ్యంగా రైతులను అధికారులు వేధిస్తున్న తీరు అమానుషుం. ఆ మధ్య ఓ మహిళ రెవిన్యూ కార్యాలయ గుమ్మానికి తాలిబొట్టు వేలాడ దీసినా న్యాయం జరగలేదు. అలాంటి వ్యవస్ధలో వున్నందుకు ఈ సమాజమే సిగ్గు పడుతుంది.
ఉద్యోగ వ్యవస్థలో మహిళలు వుంటే అవినీతికి ఆస్కారం వుండదని అందరూ అనుకునేవారు. కాని అదేంటో ఇటీవల పట్టుబడుతున్న అధికారుల్లో ఎక్కువ శాతం మహిళలలే కావడం గమనార్హాం. ఇలా ఎందుకు జరుగుతోందన్నది ఆలోచించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే మేమేం తక్కువ అవినీతి చేయడంలో అనుకుంటున్నారా? లేక మమ్మల్ని ప్రశ్నించేందుకు ఎవరికీ ధైర్యం వుండదన్న భరోసాతో చేస్తున్నారా? అర్ధం కావడంలేదు. ఓవైపు అవినీతికి పాల్పడుతూ, మీడియాలో వార్తలు వస్తే తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ లీగల్‌ నోటీసులు కూడా పంపించేస్ధాయికి చేరుకుంటున్నారు. ఒకప్పుడు మీడియాలో అదికారుల గురించి వార్తలు వస్తే అధికార వర్గాలన్నీ అలెర్టుయ్యేవి. కాని ఇప్పుడు మీడియాకే లీగల్‌ నోటీసులు పంపించు అని సలహాలిచ్చేదాకా చేరుకున్నారు. అవినీతిని ఒకరునొకరు ప్రోత్సహించుకుంటున్నారు. వాటాలు పంచుకుంటున్నారు. పట్టుబడినా నష్టమేమీలేదు. మళ్లీ మన కొలువు మనకు వస్తుంది. లేకుంటే సంపాదించుకున్నది వుండనే వున్నది అనేదాకా వెళ్తున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు. పట్టుబడితే సుద్దపూసలుగా ముఖం పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *