విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్లో విద్య శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు.