నమ్మకం లేనప్పుడే గ్యారంటీలు,వారంటీల గురించి మాట్లాడుతరు.ఎంపీ రవిచంద్ర
ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నమ్మరు
వెంకట్రావు పగటి కలల్ని కేసీఆర్ భగ్నం చేశారు.
వనమా అంటే కేసీఆర్ కు గౌరవం,అభిమానం,ఆయన కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని భోజనం చేశారు
బీసీల పట్ల కేసీఆర్ కు ప్రేమ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం
నవంబర్ 5న 80వేల మందితో కేసీఆర్ సభను విజయవంతం చేసి వనమా గెలుపును ఖాయం చేసుకుందాం:ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాల్వంచ టౌన్. వనమా నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఎంపీ రవిచంద్ర
మనిషి మీద,వస్తువుపై నమ్మకం లేనప్పుడే గ్యారంటీలు, వారంటీలనే మాటలు వినపడతాయని, సందర్భాలు వస్తాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఇప్పుడు గ్యారంటీలంటూ దేశాన్ని 50ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఊదరగొడ్తున్నదని,మన భారతీయులు పడుతున్న కష్టాలు,నష్టాలన్నింటికి ఆ పార్టీనే మూల కారణమన్నారు.బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ రవిచంద్ర మంగళవారం మధ్యాహ్నం పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో ముఖ్య కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు ఇక సాగవని,డబ్బు సంచులతో వచ్చే దొంగలను తెలివైన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఏ మాత్రం విశ్వసించరని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.వనమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన జలగం వెంకట్రావు ఢిల్లీ, హైదరాబాద్ లలో కోర్టు చుట్టూ తిరిగి ఏదో సాధించానని గొప్పలకుపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పగటి కలల్ని వమ్ము చేశారన్నారు.వనమాను కుటుంబంతో సహా ప్రగతిభవన్ కు ఆహ్వానించి కలిసి భోజనం చేయడాన్ని గుర్తు చేస్తూ,బీసీల పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమాభిమానాలకు ఇదే ప్రబల నిదర్శనమన్నారు.సీనియర్ ఎమ్మెల్యే అయిన వనమా అంటే కేసీఆర్ చాలా గౌరవం ఉందని,తనకు పెద్దన్న వంటి వెంకటేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకే ఇక్కడకు వచ్చానన్నారు.తాను ఇంఛార్జిగా నియమితులైనప్పుడు వినపడిన ఊహాగానాలు, పుకార్లు ఉత్తివేనని తేలిపోయిందని ఎంపీ రవిచంద్ర వివరించారు.సంపద సృష్టించడం పేదలకు పంచడం అనే గొప్ప ఆశయంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని,రాష్ట్రం చుట్టూ జలాలతో ఫెన్సింగ్ నిర్మించారన్నారు.సీతారామ ప్రాజెక్టు కూడా త్వరలో జాతికి అంకితం కానున్నదని,కాలం కూడా కలిసివస్తున్నదని, కేసీఆర్ రూపంలో మనకిది అదృష్టం,వరం అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి 3వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, ఇదొక రికార్డు అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.వచ్చే నెల 5వ తేదీన ఇక్కడ జరిగే బీఆర్ఎస్ సభకు 80వేల మందికి పైగా హాజరై విజయవంతం చేయడం ద్వారా వనమా గెలుపును ఖాయం చేసుకుందామన్నారు.కొత్తగూడెం మండలం, కొత్తగూడెం మునిసిపాలిటీ,సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవీపల్లి, సుజాతానగర్, పాల్వంచ మండలాలకు చెందిన నాయకులు,కార్యకర్తలతో ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే వనమాతో కలిసి బృందాల వారీగా సమావేశమై ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ వైస్- ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కొత్తగూడెం మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ,వైస్ ఛైర్మన్ వీ.దామోదర్,బీఆర్ఎస్ ప్రముఖులు సర్థార్ పుటం పురుషోత్తం రావు,కొత్వాల శ్రీనివాస్, రాంబాబు, వాసుదేవరావు,కాసుల వెంకట్,జేవీఎస్ చౌదరి,రాజుగౌడ్, హనుమంతరావు,రజాక్,బత్తుల వీరయ్య, సోమిరెడ్డి తదితరులు ప్రసంగించారు.