State 3rd Rank Achieved by Trilokya Nath Reddy
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ 3వ ర్యాంకర్ గా రాణించిన మోరే ట్రైలోక్య నాథ్ రెడ్డి
-విద్యే విజయానికి మార్గం..యువతే దేశానికి భవిష్యత్తు
-సామాజికవేత్తలు ఎర్రబెల్లి కోటేశ్వర్ రావు, వడిజ ఆనంద్ రావు
-ఇంటర్ స్టేట్ టాపర్ లో రాణించిన కుమారునికి స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు
మొగులపల్లి నేటి ధాత్రి
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ 3వ ర్యాంకర్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మోరే ట్రైలోక్య నాథ్ రెడ్డి రాణించి పుట్టిన ఊరికి..కనిపెంచిన తల్లిదండ్రులకు..విద్య నేర్పిన గురువులకు..తోటి స్నేహితులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాడు. మొగుళ్లపల్లి మండలంలో మోరే తిరుమల-రవీందర్ రెడ్డి దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన మోరే ట్రైలోక్య నాథ్ రెడ్డి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎస్వీ పాఠశాల పర్లపల్లిలో, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆర్బీట్ హైస్కూల్ బావుపేట హసన్ పర్తిలో విద్యనభ్యసించి, పదవ తరగతిలో 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2వ ర్యాంకర్ గా వెలుగొంది..ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచాడు. ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం నారాయణ కాలేజీ, మాదాపూర్ బాసర శరణి ఖాదంబరీ టూ క్యాంపస్ లో చదివి 470 మార్కులకు 467 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంకర్ గా రాణిస్తూ..సరస్వతీ పుత్రుడిగా విద్యారంగంలో దూసుకెళుతున్నాడు. కాగా ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ 3వ ర్యాంక్ ఎంపీసీలో రాణించినందుకు తల్లిదండ్రులు స్వీట్లు తినిపించి..సంబరాలు చేసుకున్నారు.
-విద్యే విజయానికి మార్గం..యువతే దేశానికి భవిష్యత్తు
-సామాజికవేత్తలు ఎర్రబెల్లి కోటేశ్వర్ రావు, వడిజ ఆనంద్ రావు
విద్యే విజయానికి మార్గమని..యువతే దేశానికి భవిష్యత్తని, కష్టం చేసిన వారికే ఫలితం దక్కుతుందని..పట్టుదల ఉన్న వారికే విజయం వరిస్తుందని..ఓటమి ఒక పాఠం మాత్రమే అయితే..అది విజయం చివరి గమ్యమవుతుందని సామాజికవేత్తలు ఎర్రబెల్లి కోటేశ్వర్ రావు, వడిజ ఆనంద్ రావులు అన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ 3వ ర్యాంకర్ గా రాణించిన మోరే ట్రైలోక్య నాథ్ రెడ్డిని వారు అభినందించి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి కష్టపడి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ఇలాంటి ప్రతిభావంతులైన యువత..మన ప్రాంత భవిష్యత్తును నిర్మించే శక్తిగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకుండా మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారా మాత్రమే సమాజంలో స్థిరమైన మార్పు తీసుకు రాగలమని, యువత తమ ప్రతిభను సానుకూల దిశగా మలచాలని సూచించారు. అలాగే ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు నిరుత్సాహానికి లోనవ్వకుండా..ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి..మరింత పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఓటమి ఒక పాఠమని, భవిష్యత్తులో గొప్ప విజయాలకు దారితీస్తుందని తెలిపారు. చివరగా ప్రతి విద్యార్థి తన కుటుంబానికి మాత్రమే కాకుండా తన గ్రామానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
