
PM Modi to Visit Flood-Hit Punjab on September 9
రైతులను పరామర్శించేందుకు పంజాబ్లో 9న మోదీ పర్యటన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.
న్యూఢిల్లీ: పంజాబ్లో గత ఏభై ఏళ్లలో కనీవినీ ఎరుగని విధంగా వరదలు బీభత్సం సృష్టించడం, పెద్దఎత్తున ఆస్తి, పంటనష్టం సంభవించడం, లెక్కకు మిక్కిలిగా నిరాశ్రయులు కావడంతో ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటించనున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు, అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 9న ఆయన పంజాబ్లో పర్యటించనున్నట్టు బీజేపీ పంజాబ్ విభాగం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపింది. గురుదాస్పూర్లో ప్రధాని పర్యటించి వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుంటారని పేర్కొంది. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటారని వివరించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.
పంజాబ్ వరదలు
కాగా, ప్రధాన మంత్రి వర్షబాధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఇంతకుముందు తెలిపాయి. జమ్మూకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లో పర్యటించి వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలను సమీక్షిస్తారని పేర్కొన్నాయి. తూర్పు భారతదేశంలో ఎడతెరిపి లేని వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడి 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా, వరదల ప్రభావం పంజాబ్ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. సుమారు 1,650 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నారు. 1.75 లక్షల హెకార్ట పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గురుదాస్పూర్ జిల్లాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 1.45 లక్షల నివాసులపై ప్రభావం పడింది. ఆ తర్వాత వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫజిల్కా ఉన్నాయి. పంజాబ్లో 37 మంది మరణించగా, ముగ్గురి జాడ గల్లంతైంది. సెప్టెబర్ 7 వరకూ అన్ని విద్యాసంస్థలను మూసేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. గత ఐదురోజులుగా పంజాబ్లో వర్షాలు పడుతుండటంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.