జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.ముదిగుంట గ్రామంలో 25 లక్షల సిఎస్ఆర్ నిధులతో సిసి రోడ్లు,సైడ్ డ్రైనేజీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ త్రాగు నీరు ఉపయోగంలోకి రాకపోవడంతో గ్రామాలలో త్రాగునీటి సమస్య ఏర్పడిందని,త్రాగు నీటి అవసరం కొరకు అవసరమైన బోర్లు ఏర్పాటు చేస్తామని అలాగే సిసి రోడ్లు,సైడ్ డ్రైనేజీలను నెల రోజుల్లో పూర్తిచేసి గ్రామాలలో అభివృద్ధిని చూపిస్తూ చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడమే తన ముఖ్య లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లతో భారీగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
*ఇందారంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే*
ఇందారం గ్రామంలో డిఎంఎఫ్టి 4 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువలు,మరో 4 లక్షలతో సిసి రోడ్ల ఏర్పాటుకు భూమి పూజ చేసినారు.అలాగే గ్రామాల్లో నెలకొన్న పలు రకాల సమస్యలు పరిష్కరించాలని స్థానిక మహిళలు ఎమ్మెల్యేని కోరగా సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు.తర్వాత ఈ నెల 11న జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించి క్రికెట్ టోర్నమెంట్ వివరాలతోపాటు నిబంధన నియమావళి కరపత్రాలను తన చేతుల మీదుగా విడుదల చేశారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని టోర్నమెంట్ ని విజయవంతం చేయాలని కోరారు.