రైతులు,మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో కొడవటంచ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పశుసంవర్ధక చికిత్స అవగాహన శిబిరం, రైతు వారోత్సవం, రైతు వారం నీటిపారుదల శాఖ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రారంభించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు,పాడి పశువుల పెంపకదారులు మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.పాడి పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స, మేలు జాతి దూడల పెంపకం కోసం లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు.అలాగే రైతు వారోత్సవం కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో కలుపు నివారణ,చేపల వ్యాధుల నిర్వహణ,చేపల ఉత్పత్తి పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతు వారం కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు, కాలువలలో పూడిక తొలగింపు,జమ్ము కంపచెట్ల తొలగింపు వంటి పనులను సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి భూపాలపల్లి మార్కేట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు ప్రజాప్రతినిధులు,రైతులు, మత్స్యకారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
