ఏకగ్రీవమైన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
సర్పంచ్ పదవి ప్రజలకు నేరుగా సేవ చేసే గొప్ప బాధ్యత
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామాలకు సర్పంచ్ పదవి ప్రజలకు నేరుగా సేవ చేసే గొప్ప బాధ్యత అని, ప్రజలందరి సంఘీభావంతో ఏకగ్రీవ సర్పంచ్ నిర్ణయం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొదటి, రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ లందరికీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాలల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలన్నారు. గ్రామ ప్రజల ఐక్యతతో, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవడం సంతోషమన్నారు. ఈ నిర్ణయం గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగు నీరు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలన్నారు.అనంతరం ఎమ్మెల్యేతో మండలాల వారిగా సర్పంచ్ లు గ్రూపు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
