ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు అందుబాటులో లేవని వారు చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీమతి యశస్విని రెడ్డి తక్షణమే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదు, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లాజిస్టిక్స్ సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు అని కలెక్టర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను అని అన్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ధాన్యాన్ని తడి కాకుండా కాపాడుకోవడం అవసరం రైతులకు ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అధికారులను ఆదేశించారు. అదనంగా, వారు అధికారులను ఆలస్యం కాకుండా, ఖచ్చితమైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రైతులు ఎటువంటి అవినీతిని సహించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ తనిఖీతో గ్రామస్థుల్లో, రైతుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడతానని వారు హామీ ఇచ్చారు.