దేశంలో సంపూర్ణ అక్షర్యాత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం!

`అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు

`మితిమీరిన ప్రైవేటీకరణతో విద్యావ్యస్థకు పెనుముప్పు

`ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు

`జవాబుదారీతనం కరువు కావడమే కారణం

`డ్రాపౌట్ల భయంతో డిటైనింగ్‌ను తొలగించడతో పడిపోతున్న ప్రమాణాలు

`ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి

`వైఫల్యాలనుంచి ఎవరికివారు తప్పించుకునే మార్గాల అన్వేషణ

డెస్క్‌ ,నేటిధాత్రి: 

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొత్తం అక్షరాస్యతా శాతం కేవలం 14% మాత్రమే. తర్వాతి సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యతా సాధనకో సం చేపట్టిన వివిధ కార్యక్రమాల కారణగా దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. ఆవి ధంగా 2022 నాటికి మనదేశంలో అక్షరాస్యత 76.32శాతానికి పెరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు అక్షరాస్యతలో సాధించిన ప్రగతి ఒకే మాదిరిగా లేదు. రాష్ట్రాల మధ్య తేడాలుండటంతో అందుతున్న సమాచారం ఇప్పటికీ సమగ్రంగా లేదనే చెప్పాలి. ఇదిలావుండగా మే 21న మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ప్రకటన చేశారు. రాష్ట్రం పూర్తిస్థాయి అక్షరాస్యత సాధించిందన్నది ఈ ప్రకటన సారాంశం. అయితే విద్యామంత్రిత్వశాఖ నిర్దేశించిన 95% అక్షరాస్యత లక్ష్యాన్ని అధిగమించి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం నిలవడం విశేషం. 2011 జనగణనలో మిజోరం అక్షరాస్యత లో దేశంలో మూడోస్థానంలో వుంది. నాటి అక్షరాస్యత 91.33%. ప్రస్తుతం 98.2% అక్షరాస్యతతో దేశంలోనే అత్యధిక అక్షరాస్యులు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇందుకుపూర్తి విరుద్ధంగా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లు 72.6%, 74.3%తో దేశం లోనే అట్టడుగున ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు 2023ా24 సంవత్సరం నాటికి ఏడేళ్ల వయసు పైబడిన స్త్రీ,పురుషుల్లో అక్షరాస్యత 80.9%. నిజంచెప్పాలంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధికి అక్షరాస్యతనే కొలమానంగా తీసుకుంటారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఏడేళ్ల వయసు పైబడినవారు ఏదైనా ఒక భాషను రాయడం, చదవడం, మాట్లాడటం చేయగలిగితే అటువంటివారిని అక్షరా స్యులుగా పరిగణిస్తారు. 2024 నాటికి మనదేశంలో అక్షరాస్యత విషయంలో తొలి పది స్థానాలుసాధించిన రాష్ట్రాలు వరుసగా మిజోరం(98.2%), లక్షద్వీప్‌ (97.3%), నాగాలాండ్‌ (95.7%), కేరళ (95.3%), మేఘాలయ (94.2%), త్రిపుర (93.7%), చండీగఢ్‌ (93.7%),గోవా (93.6%), పురుచ్చేరి (93.7%), మణిపూర్‌ 992%). 

ఇక అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న పది రాష్ట్రాలు వరుసగా ఆంధ్రప్రదేశ్‌ (72.6%), బిహార్‌ (74.3%), మధ్యప్రదేశ్‌ (75.2%), రాజస్థాన్‌ (75.8%), రaార్ఖండ్‌ (76.7%), తెలంగాణ (76.9%), ఉత్తరప్రదేశ్‌ (78.2%), ఛత్తీస్‌గఢ్‌ (78.5%), లద్దాఖ్‌ (81%), జమ్ముÊ కశ్మీర్‌ (82%). 

2011 జనగణలో అక్షరాస్యతలో మూడో స్థానంలో వున్న మిజోరం నేటికి దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం కేంద్రం ప్రవేశపెట్టిన సమగ్ర శిక్ష మరియు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమేనని చెప్పాలి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర శిక్ష మిజోరం కార్యక్రమం కూడా ఈ లక్ష్యసాధనలో గొప్ప చోదకశక్తిగా పనిచేసింది. మిజోరం ముఖ్యమంత్రి, రాష్ట్రం సాధించిన సంపూర్ణ అక్షరాస్యత గురించి ప్రకటించిన ప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వన్‌లాల్‌థలానా, కేంద్ర విద్యాశాఖసహాయమంత్రి జయంత్‌ చౌదరి కూడా వుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద మిజోరంను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించారు. 

 క్లస్టర్‌ రోసోర్స్‌ సెంటర్‌ కోఆర్డినేటర్లు (సీఆర్‌సీసీ) ఆధ్వర్యంలో 2023 ఆగస్టుాసెప్టెంబర్‌ నెలల్లోమిజోరంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 15కంటే ఎక్కువ వయసున్నవారిలో 3026 మంది నిరక్షరాస్యులుగా వున్నట్టు గుర్తించారు. వీరిలో 1692మంది తర్వాత వివిధ అభ్యసన కార్యక్రమాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఆక్షరాస్యతా శా తం 98.2%కు చేరుకుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు మిజోరం ప్రభుత్వం స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ లిటరసీ (ఎస్సీఎల్‌)ను ఏర్పాటు చేసింది. ఇది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎ డ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సంస్థ మిజో భాషను నేర్చుకోవడానికి వీలుగా ‘వర్టియన్‌’ పేరుతో మరియు ఇంగ్లీషు భాషకోసం కార్యక్రమాలను అభివృద్ధి చేసి లాంగ్ట్‌లాయ్‌ జిల్లాలో అమలు చేశారు. వీటికి అనుబంధంగా ‘రోమై’ కార్యక్ర మాన్ని, నేర్చుకునేవారి కోసం, వాలంటీర్‌ టీచర్ల కోసం ‘మార్గదర్శిక’ పేరుతో మరో కార్యక్రమా న్ని అభివృద్ధి చేసి అమలు చేశారు. ఆవిధంగా మొత్తం 292 మంది వలంటీర్‌ టీచర్లను నియ మించి పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, వైఎంఏ లైబ్రరీల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాలకు ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద సంపూర్ణ మద్దతు కల్పించారు. యూఎల్‌ఎల్‌ఏఎస్‌ కార్యక్రమాన్ని 2022 నుంచి 2027 వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. ముఖ్యంగా సంప్రదాయ విద్యను అభ్య సించలేకపోయిన 15ఏళ్ల వయసు పైబడినవారిని అక్షరాస్యులుగా చేయడం లక్ష్యంగా కార్యక్ర మం పనిచేస్తుంది. 

మిజోరం దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు పొందగా, ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప అక్షరాస్యతారేటులో అట్టడుగున నిలిచింది. తెలంగాణ పరిస్థితి కూడా దారుణంగా వుంది. అట్టడుగు అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఆరోస్థానం ఆక్రమించింది! మిగిలిన కర్నాటక, తమిళనాడుల పరిస్థితి కూడా అక్షరాస్యతలో మెరుగ్గా ఏమీ లేదు. ఎందుకని ఈవిధంగా జరుగుతున్నదని ప్రశ్నిస్తే, విద్య కార్పొరేటీకరణ జరగడం. పలితంగా డబ్బున్న వారికి మాత్రమే విద్య అందుబాటులోకి రావడంతో నిరుపేదలకు విద్య అందని ద్రాక్షగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం,ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ విద్యాకార్యక్రమాలు, అమలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్నది ఒక అభియోగం. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లుఅత్యధిక వేతనాలు తీసుకుంటూ పనిచేస్తున్నా, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న టీచర్లు కలిగిన ప్రైవేటు పాఠశాలలు అత్యధిక ర్యాంకులు సాధించడానికి కారణం ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రైవేటు విద్య అందుబాటులోకి రాకముందు, అన్ని వర్గాలవారు ప్ర భుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు. ఉపాధ్యాయుల్లో కూడా నిబద్ధత కనిపించేది. కానీ రాను రాను విద్య ప్రైవేటీకరణ జరగడంతో, పాఠశాలల్లో విద్య నాణ్యత పడిపోవడం మొదలైంది. నిర్ల క్ష్యం, బాధ్యతారాహిత్యం, యూనియన్‌ కార్యకలాపాలు, ప్రైవేటు వ్యాపారాలపై మోజు పెరిగిపోవ డంతో ప్రభుత్వ విద్య క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతోపాటు తల్లిదండ్రుల్లో ర్యాంకులపట్ల మోజు పెరగడం కూడా ప్రైవేటు విద్యపై మక్కువ పెరగడానికి ప్రధాన కారణం. చివరకు పరిస్థితి ఏదశకు చేరకుందంటే ప్రభుత్వ పాఠశాలలతో, ప్రైవేటు పాఠశాలలు పోటీపడాల్సింది పోయి సీన్‌ మొత్తం రివర్సయింది. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలనే ప్రభుత్వ పాఠశాలలు అనుసరిస్తున్నాయి. ఇదిలావుండగా ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల, తరగతికి తగిన విద్యాప్రమాణాలు సాధించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తు న్నారు. ఫలితంగా విద్యార్థులు పేరుకే పైతరగతులకు వెళ్లడం తప్ప, వారికి ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం కూడా లేకపోవడం చాలా సందర్భాల్లో రుజువైంది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు బలమైన పునాదివేయకుండా పైతరగతులకు పంపడం కొనసాగినంతకాలం ప్రభుత్వ విద్య ఎప్పటికప్పుడు కునారిల్లుకుపోతూనే వుంటుంది. పదోతరగతి ఉపాధ్యాయులు, ఆ తరగతి ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన చేయలేని స్థితి. ఎందుకంటే విద్యార్థుల్లో ఆయా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునే గ్రహణ సామర్థ్యం కొరవడటమే. ఐదారు దశాబ్దాల క్రితం డిటైనింగ్‌ పద్ధతి వుండేది కనుక, తగిన ప్రమాణాలు సాధించిన విద్యార్థులే పై తరగతులకు వెళ్లేవారు. ఫలితంగా ఉన్నత తరగతులకు చేరిన విద్యార్థులు ఆస్థాయి ప్రామాణిక విద్యను అర్థం చేసుకునేవారు. ఇప్పుడది పూర్తిగా కనుమరుగైపోయింది. డ్రాపౌట్ల భయంతో తగిన అర్హత సాధించని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడంతో అక్కడి ఉపాధ్యాయులపై పెను భారం పడుతోంది. చివరకు వైఫల్యాలలనుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు కారణాలు వెతుక్కుంటున్న దుస్థితి ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లిస్తున్నా, వారు తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో చూపలేకపోవడానికి పైన చర్చించిన అంశాలు ప్రధాన కారణం. వీటిపై దృష్టి పెట్టకుండా, చేతిపై పుండుకు కాలికి వైద్యం చేసిన చందంగా చేపట్టే కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతమాత్రం దోహదకారి కానేరవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!