రాజకీయాలను వ్యాపారంగా మార్చిన పాలక పార్టీలు
రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన బూర్జువా పార్టీలు
ప్రజా సమస్యల పరిష్కారం, రాజకీయ విలువలకై ఎన్నికల్లో ఎంసిపిఐ(యు) పోటీ
ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజాసేవ కోసం ఏర్పడిన రాజకీయాలను వ్యాపారంగా మార్చి లబ్ధి పొందడమే ధ్యేయంగా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రలోభాలతో పాలక పార్టీలు ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ సమావేశం డివిజన్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన పట్టణంలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాల్సిన పాలక పార్టీలు స్వార్థంతో అధికారం కోసం ఎన్నికల్లో గెలవడానికి విలువలను మరిచి తప్పుడు పద్ధతుల్లో ఓటర్లను ప్రభావితం చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్న సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు సమస్యలను మరింత పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీతికి నిజాయితీకి రాజకీయ విలువలకు నిలువుటద్దంగా నిలిచిన అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ లాంటి త్యాగదనుల ఆశలు ఆశయాలకు భిన్నంగా పాలక పార్టీలు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజలకు అవసరాలు తీర్చడానికి పోరాడడానికి ఎర్రజెండా నిత్యం పరితపిస్తుందని దోపిడీ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుందని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా నిలబడుతుందని ఈ క్రమంలో ప్రజా సమస్యలను ఎజెండాగా చేసుకుని రాజకీయ విలువలను కాపాడడానికి ఎంసిపిఐ(యు) నిరంతరం ప్రయత్నిస్తుందని అందుకోసమే మున్సిపల్ ఎన్నికల్లో ఐదు వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజలు ఆదరించి గెలిపించాలని ఆ దిశలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాయబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేల్లి కొమురయ్య, కుసుంబ బాబూరావు,వంగల రాఘసుధ, డివిజన్ నాయకులు కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మహమ్మద్ అలీ సాబ్, కర్నే సాంబయ్య, చెక్క వెంకటయ్య, ఏఐసిటియు జిల్లా కోశాధికారి మాశోక్ తదితరులు పాల్గొన్నారు.
